Friday, 1 June 2018

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త

10 లక్షల మందికి నిరుద్యోగ భృతి


ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వం భృతిని అందించనుంది. కనీస విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా ఉండి.. ఉద్యోగం లేనివారికి ఈ భృతి చెల్లించేందుకు నిర్ణయించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనుంది.

లబ్ధిదారుడి బ్యాంక్‌ అకౌంట్‌లోనే నిరుద్యోగ భృతి వేయనుంది ప్రభుత్వం. కుటుంబంలో ఇద్దరు అర్హులు ఉన్నా నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు నిర్ణయించింది. అయితే 22 నుంచి 35 ఏళ్ల వయస్సు కల్గినవారే ఇందుకు అర్హులుగా ప్రకటించింది. నిరుద్యోగ భృతి తీసుకున్నవారిని.. ప్రభుత్వం చేపట్టిన సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయనుంది. నిరుద్యోగ భృతి అమలుతో రాష్ట్ర ఖజానాపై ఏడాదికి 1200 కోట్లు రూపాయల భారం పడనుంది.
రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం.. 12 దేశాల్లో ఇస్తున్న నిరుద్యోగ భృతిని పరిశీలించింది. మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ అనంతరం.. కొన్ని విధివిధానాలనూ కూడా రూపొందించింది. వీటిపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాక.. వారి స్పందనను బట్టి మార్పులు చేర్పులు చేయనుంది. అనంతరం మరోసారి కేబినెట్‌లో చర్చించి అమలుచేసే తేదీని ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Thursday, 1 February 2018

2018 ఏపీ కేటాయింపులు

ఏపీకి కేటాయింపులు:
  • ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.10 కోట్లు
  • ఏపీ నిట్‌కు రూ.54 కోట్లు
  • ఏపీ ఐఐటీకి రూ.50కోట్లు, ఐఐఎంకు రూ.42 కోట్లు
  • ఏపీలో ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు
  • ఏపీ ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు
  • ఏపీ ట్రైబల్ యూనివర్సిటీకి రూ.10కోట్లు
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్యాకేజింగ్‌కు రూ.5కోట్లు
  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియంకు రూ.32 కోట్లు
  • డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.19.62 కోట్లు
  • విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.1400 కోట్లు 

Thursday, 25 January 2018

సోషల్ మీడియాలో మహేశ్ ఫస్ట్ పోస్ట్.. వైరల్

హైదరాబాద్: ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన టాలీవుడ్ సూపర్ స్టార్ కేవలం రెండు రోజుల్లోనే 6.8 లక్షల మంది ఫాలోయర్లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు. తాజాగా ఆయన చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్ తొలి పోస్టుకు అనూహ్యమైన స్పందన వస్తోంది. తన లేటెస్ట్ ప్రాజెక్టకు సంబంధించిన ఓ ఫొటో అప్‌లోడ్ చేసిన మహేశ్.. ‘రేపు ఉదయం 7 గంటలకు’  అంటూ చేసిన తొలి పోస్టును గంట వ్యవధిలోనే 22 వేల మంది లైక్ చేశారు.
గతంలో తనకు శ్రీమంతుడు లాంటి భారీ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘భరత్‌ అనే నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇందులో కియారా అద్వాని కథానాయిక. మహేశ్ సీఎం పాత్రలో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్ కాగా, రిపబ్లిక్‌ డే.. ఉదయం ఏడు గంటల సమమానికి రెడీగా ఉండండి. ఆల్‌ ఆడియో ప్లాట్‌ఫామ్స్‌లో భరత్‌ ఫస్ట్‌ ఓత్‌ (ప్రమాణం) వినడానికి అంటూ ఇటీవల యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ మూవీ పోస్టర్ ను మహేశ్ అప్‌లోడ్ చేయగా ఆయన ఫాలోయర్లు టాలీవుడ్ ప్రిన్స్ తొలి ఇన్‌స్టాగ్రామ్ సందేశంపై స్పందించి లైక్స్, కామెంట్లతో అభిమానాన్ని చాటుకుంటున్నారు.

పద్మావత్‌'కు మరోషాక్‌ :ఎఫ్‌బీలో ఫుల్‌ మూవీ


ఎన్నో వివాదాలు, మరెన్నో ఆందోళనల మధ్య సంజయ్‌ లీలా భన్సాలీ మూవీ 'పద్మావత్‌' నేడు(గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అటు కర్ణిసేన ఆందోళనలతో తీవ్ర చిక్కుల్లో కూరుకున్న ఈ మూవీకి, ఓ ఫేస్‌బుక్‌ పేజీ కూడా తీవ్ర షాకిచ్చింది. పద్మావత్‌ ఫుల్‌ మూవీని ఫేస్‌బుక్‌లో లీక్‌ చేసింది. ' జాటోన్‌ కా అడ్డ' అనే ఫేస్‌బుక్‌ పేజీ, థియేటర్‌లో స్క్రీన్‌ అవుతున్న ఈ మూవీని లైవ్‌ స్ట్రీమ్‌ చేసింది. ఇలా లైవ్‌ స్ట్రీమ్‌ అవుతున్న సమయంలోనే ఈ ఫేస్‌బుక్‌ పేజీ లింక్‌ను 15వేల మంది షేర్‌ చేయగా... ఈ వీడియోకు 3.5 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఇప్పటికే కర్ణిసేన విధ్వంసనలతో తీవ్రంగా ఆందోళన చెందుతున్న మూవీ యూనిట్‌ సభ్యులకు ఇది మరింత దిగ్భ్రాంతికి గురి చేసింది.
కాగ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గోవా, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల ఆపివేశారు. రాజ్‌పుత్‌ల ప్రభావం బలంగా ఉండడం, ప్రజల సెంటిమెంట్, కర్ణిసేన హెచ్చరికలు తదితర కారణాల వల్ల అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటాయనే భావనతో ఇక్కడ మల్టీప్లెక్స్ యజమానుల సంఘం సినిమాను ప్రదర్శించబోమని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లో పద్మావత్‌ ప్రదర్శన సాఫీగా సాగుతోంది. దీపికా పదుకోన్‌, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర​ సింగ్‌లు ఈ సినిమాలో ప్రధాన పాత్రదారులుగా నటించారు. దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా చూడ్డానికి బాగుందంటూ మిక్స్‌డ్‌ రివ్యూస్‌ కూడా వచ్చాయి. అయినప్పటికీ కర్ణిసేన ఆందోళనలను మాత్రం తగ్గించడం లేదు.

రౌడీల దుమ్ముదులుపుతున్న రవితేజ..

రౌడీల దుమ్ముదులుపుతున్న రవితేజ..

హైదరాబాద్‌ : చాలా గ్యాప్‌ తర్వాత రాజా ది గ్రేట్‌ చిత్రంతో మంచి ఫామ్‌లోకి వచ్చిన ప్రముఖ టాలీవుడ్‌ నటుడు రవితేజ. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం టచ్‌ చేసి చూడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇప్పటికే చిత్ర యూనిట్‌ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్‌ వస్తుండగా గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సినిమాలో ఓ కుటుంబాన్ని ప్రేమించే కొడుకుగా కనిపించడంతోపాటు తన జోలికి వచ్చినవారిని రఫ్పాడించే లుక్‌లో రవితేజ అదరగొట్టారు. ముఖ్యంగా 'యూనిఫాంలో ఉంటే గన్‌లో ఆరే బుల్లెట్లు.. యూనిఫాం తీసేస్తే దానమ్మ దానమ్మ రాయితో చంపుతానో రాడ్‌తో చంపుతానో నాకే తెలియదు' అంటూ ఆయన పోలీసుగా రౌడీలకు ఇచ్చే వార్నింగ్‌, ఎమోషన్‌ చూస్తుంటే ఇటు కుటుంబ ప్రేక్షకులతోపాటు మాస్‌ చిత్రాలను అమితంగా ప్రేమించే వారికి కూడా మంచి విందు భోజనంగా ఈ సినిమాను తీసుకొచ్చారనిపిస్తుంది. దాంతోపాటు రవితేజ కామెడీ టైమింగ్‌ ఎలా ఉంటుందో కూడా మనకు తెలిసిందే. విక్రమ్‌ సిరికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా వక్కంతం వంశీ కథను అందించారు. రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఆధార్ భద్రతకు బిల్లు... సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ...

న్యూఢిల్లీ : ఆధార్ సమాచార భద్రతకు కట్టుదిట్టమైన బిల్లును మార్చినాటికి సిద్ధం చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లును సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీ ఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రూపొందిస్తోందని పేర్కొంది.
 
వ్యక్తిగత గోప్యతకుగల ప్రాథమిక హక్కును ఆధార్ చట్టం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న రాజ్యాంగ ధర్మాసనానికి కేంద్ర ప్రభుత్వం ఈ హామీనిచ్చింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ కే సిక్రీ, జస్టిస్ ఏ ఎం ఖన్విల్కర్, జస్టిస్ డీ వై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ ఉన్నారు. ఆధార్ చట్టం రాజ్యాంగ బద్ధతను పిటిషనర్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

Monday, 22 January 2018

ప్రశ్న ఇప్పుడొక ద్రోహం.. దీనిమీదే సినిమా తీస్తా: కత్తి మహేష్

నిమ్మళంగా కనిపిస్తారు గానీ ఆయన పెదవి విప్పితే, వొర లోంచి సర్రున కత్తి దూసినట్టే మాట బయటకు వస్తుంది. సోషల్‌ మీడియాలో ఆయన సినిమా విమర్శలు కూడా అంతే, ఎడాపెడా చెరిగేయడమే. ఈ ధోరణే ఆయనను వివాదాలకు కేంద్రం చేసింది. వార్తల్లోని వ్యక్తిగా మార్చింది. ఆయన కత్తి మహేష్‌. మన చిత్తూరు జిల్లా వాసి. ఎర్రావారిపాళెం మండలం యలమంద ఆయన ఊరు. హైదరాబాద్‌‌లో స్థిరపడ్డ కత్తి మహేష్‌, పండక్కి సొంత ఊరు వచ్చారు. ఈ సందర్భంగా వర్తమాన సంగతులను ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు.
 
కత్తి మహేష్‌ పుట్టిన ఊరు ఎల్లమంద. ఆయన తండ్రి కత్తి ఓబులేశు ప్రస్తుతం ఊళ్లోనే ఉన్నారు. అమ్మ కత్తి సరోజమ్మ ఏడాదిన్నర కిందట మరణించారు. మహేష్‌ అన్న కత్తి రవికుమార్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నారు. చెల్లెలు వాణిశ్రీ సికిందరాబాద్‌లో న్యూట్రిషనిస్ట్‌గా ఉన్నారు. మహేష్‌ భార్య సొనాలిది కోల్‌కత్తా. వీరిది ఇంటర్నెట్‌ ప్రేమ. ఆమె లక్‌నవ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉన్నారు. ఎనిమిదేళ్ల కొడుకు తల్లి దగ్గరే ఉన్నాడు. మహేష్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌లో ఎంఏ చేశారు. సినిమా రంగంలో స్థిరపడ్డారు.
 
పీలేరు టౌన్‌(చిత్తూరు జిల్లా): దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రస్తుతం ప్రజాస్వామిక వాతావరణం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పెద్దల్నీ, రాజకీయ నేతల్నీ ప్రశ్నించేవారిని అణిచివేసే పరిస్థితి నెలకొని ఉంది. ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ పరిస్థితుల్ని సామాన్య ప్రజలల్లోకి తీసుకువెళ్ళడం కోసం ఒక వ్యంగ్య చిత్రం నిర్మించబోతున్నాను. ఫిబ్రవరిలో సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తాం. ప్రశ్నించడం వల్లే నేను ఈ రోజు ఉభయ తెలుగు రాష్ర్టాలకూ సుపరిచితుడయ్యాను. సినిమా, టీవీ రంగంలో ఉన్నందువల్లే ప్రశ్నించడానికీ, నా గొంతును వినిపించడానికీ ఒక వేదిక దొరికింది. వేదిక దొరకని వారు ఎందరో దేశంలో ఉన్నారు. వారందరికీ నేను గొంతుకనవుతున్నాను.
 
అభివృద్ధిలో అసమానతలు:
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలోని అసమానతని నేను ప్రశ్నిస్తున్నాను. కేవలం హైదరాబాదు పరిసర ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేసి ఇది వరకే ఒకసారి తప్పు చేశామని ఒప్పుకుంటున్న పాలకులు మళ్ళీ అవే తప్పుల్ని చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతిష్టాత్మక సంస్థల్ని అమరావతి చుట్టూ కేంద్రీకృతం చేసి మిగతా ప్రాంతాల్ని పట్టించుకోవడం లేదు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తే అన్ని విధాలా వెనుకబడ్డ ఈ ప్రాంతం అభివృద్ధికి ఊతం లభిస్తుంది.
 
నా వెనుక ఎవరూ లేరు:
కొంత మంది ప్రచారం చేస్తున్నట్లు నా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు. నాకు ఎవరి మద్దతూ లేదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఆలోచనా లేదు. భవిష్యత్తులో నా సిద్ధాంతాలు నచ్చి ఆహ్వానించే రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా ఉండడానికి మాత్రం ఇష్టపడతాను. టీవీ రంగంలో ఉన్నందువల్లే బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనే అవకాశం లభించింది. ఎవరి సిఫార్సు లేదు. బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న అందరితో ఇప్పటికీ నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. మేమందరం ఒక వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిరోజూ అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటాం.
 
నేనూ నా సినిమా:
నేను ఇప్పటిదాకా రెండు షార్టు ఫిల్మ్స్‌, మూడు సినిమాలు తీశాను. బాలగంగాధర్‌ తిలక్‌ రచన ‘ఊరి చివర ఇల్లు’ స్ఫూర్తితో ‘ఎడారి వర్షం’ పేరుతో మొదటి షార్ట్‌ ఫిలిం తీశాను. ఒక వైద్యుడు తన తల్లిని వెతుక్కుంటూ వెళ్లే కథాంశంతో ‘కృతజ్ఞత’ పేరుతో ఇంకో షార్ట్‌ ఫిలిం తీశాను. క్రౌడ్‌ ఫండింగ్‌తో 12 మంది నిర్మాతలతో కలిసి ‘పెసరట్టు’ అనే సినిమా తీశాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో 62 థియేటర్లలో ప్రదర్శింపబడి ఆ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. చిన్నారుల్లో అంతరించిపోతున్న సహజ లక్షణాలు, వాటి పర్యవసనాలను వివరిస్తూ ‘ఎగిసే తారాజువ్వలు’ అనే సినిమా తీశాను.
 
2017 నవంబర్‌ 14న రిలీజైన ఆ సినిమాకు ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అఫిషియల్‌ ఎంట్రీ లభించింది. నేను సహ రచయితగా వ్యవహరించిన ‘మిణుగురులు’ అనే సినిమాకు మంచి అభినందనలు వచ్చాయి. ఆ సినిమా స్ర్కిప్టును ఆస్కార్‌ అకాడమీ లైబ్రరీలో శాశ్వతంగా పొందుపరిచారు. ఈ ఘనత దక్కిన మొట్టమొదటి తెలుగు సినిమా ‘మిణుగురులు’. ‘హృదయకాలేయం’, ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాల్లో నేను నటించాను. తెలుగు సినిమా రంగంలో విమర్శకుల కొరత ఉంది. అందుకే ఆ రంగంలోకి ప్రవేశించాను. ఇకపై కూడా విమర్శకుడిగా కొనసాగుతాను. వివాదాలు వెంటాడుతున్నా సినీ పరిశ్రమలో నాకు మంచి మిత్రులున్నారు.
 
అది అమ్మ మరణ దు:ఖం:
ఒక టీవీ చర్చలో మా అమ్మ గురించి అడగగానే సమాధానం చెప్పకుండా నేను ఎందకు లేచివెళ్లిపోయానని చాలా మంది అడుగుతున్నారు. మా అమ్మ గురించి దర్శకుడు వివేక్‌కృష్ణ అడిగిన విధానం నాకు నచ్చలేదు. కేన్సర్‌ బారిన పడి కిమోథెరపీతో ఎముకల గూడులా మారి మా అమ్మ చనిపోయింది. అది గుర్తొచ్చి నాకు మాట రాలేదు. వివేక్‌కృష్ణను వారించాల్సిన యాంకర్‌ సైతం అతడినే సమర్థిస్తూ మాట్లాడడంతో నేను అక్కడ ఉండడం ఇష్టం లేక వచ్చేశాను.