Monday, 22 January 2018

భారత్‌ అంటే వాణిజ్యం

- దావాస్‌ పర్యటనకు ముందు ప్రధాని మోడీ
- నేటి నుండి ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాలు
- హాజరుకానున్న చంద్రబాబు
                 న్యూఢిల్లీ/అమరావతి బ్యూరో : 'భారత్‌ అంటే వాణిజ్యం' అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ    పేర్కొన్నారు. దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాలకు బయలుదేరే ముందు ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఇదే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్లో వరుస సందేశాలనుంచిన ఆయన వాటిలో 'అంతర్జాతీయ సమాజంతో భారత్‌ భవిష్యత్‌ వ్యూహాలను చర్చించేందుకు ఆసక్తిగా ఉన్నా' అని పేర్కొన్నారు. దావోస్‌లో సోమవారం నుండి ఐదు రోజుల పాటు జరగనున్న 48వ ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యుఇఎఫ్‌) వార్షిక సమావేశంలో ప్రధాని మోడీతో భారత్‌ తరపున దాదాపు 130 మంది పాల్గొననున్నారు ''భిన్నమైన ప్రపంచంలో భాగస్వామ్య భవిష్యత్‌ సృష్టించడం'' అనే ఇతివృత్తంతో ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సమావేశం జరుగుతుందని ఛైర్మన్‌ క్లాస్‌ స్చ్వాబ్‌ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంధ్రమోడీ మంగళవారం నాడు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుతో పాటు, మంత్రులు యనమల, నారా లోకేశ్‌, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, వ్యవసాయ సలహాదారు విజయకుమార్‌, ఇడిబి సిఇఒ కృష్ణకిషోర్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోఖ్యరాజ్‌ ఇతర సిఎంఒ అధికారులు దావోస్‌ సమావేశాలకు హాజరవుతున్నారు. ప్రధానమంత్రి హోదాలో భారత నాయకుడు దావోస్‌ సమావేశాలకు హాజరుకావడం 20 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. 1997లో హెచ్‌డి దేవగౌడ ఈ సమావేశాలకు హాజరయ్యారు,. ఈ సమావేశంలో స్వాగత కార్యక్రమానికి భారత్‌ ఆతిథ్యమిస్తోంది. మోడీ దావోస్‌లో కేవలం 24 గంటలు మాత్రమే పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక ఫోరానికి చెందిన 120 మంది అంతర్జాతీయ వాణిజ్య ప్రముఖులతో ఆయన మంగళవారం సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు అలైన్‌ బ్రెస్ట్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో మోడీ వెంట ఆరుగురు కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, సురేష్‌ ప్రభు, పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, ఎంజె అక్బర్‌, జితేంద్ర సింగ్‌ తదితరులు పాల్గొంటారు.
ముగింపు సమావేశానికి ట్రంప్‌ 
ప్రపంచ దేశాల నేతలతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఆయన సమావేశాల ముగింపు సందర్భంగా ప్రసంగించనున్నారు . పాక్‌ ప్రధాన మంత్రి షహీద్‌ ఖకాన్‌ అబ్బాసి కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. అయితే .ఆయనకు, మోడీకి మధ్య ఎటువంటి సమావేశం ఉండదని అధికారులు తెలిపారు. జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌, ఇటలీ ప్రధాని పావ్‌లో జెన్‌టిలోని, యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జంకర్‌, ఫ్రాన్సు అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌, బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మే, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్య్రూడు తదితరులు హాజరుకానున్నారు.
25 ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్న బాబు 
దావోస్‌ చర్చల్లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు . ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి సోమవారం తెల్లవారుజామున దావోస్‌కు వెళ్లనున్నారు. 25 కీలక ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. వ్యవసాయం, టెక్నాలజీ వినియోగం, ఆహార భద్రత, గ్లోబల్‌ ఫండ్‌, ఐటి, తయారీ రంగం, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై సమావేశాల్లో చర్చిస్తారు.. ఈనెల 25న చంద్రబాబు తిరిగి అమరావతి చేరుకుంటారు.

No comments:

Post a Comment